లక్నో: ఒక ఇంట్లో దూరిన పామును ఒక వ్యక్తి పట్టుకున్నాడు. అయితే దానిని జనానికి చూపిస్తుండగా అది అతడ్ని కాటేసింది. దీంతో కొన్ని గంటల తర్వాత ఆ వ్యక్తి మరణించాడు. ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జైతీపూర్ ప్రాంతానికి చెందిన 55 ఏళ్ల దేవేంద్ర మిశ్రా, పాములను పట్టుకోవడంలో దిట్టగా పేరుగాంచాడు. సుమారు 200కుపైగా పాములను అతడు పట్టుకున్నాడు.
కాగా, మరుఝల మాజీ గ్రామ పెద్ద అయిన దేవేంద్ర, శుక్రవారం తన గ్రామంలోని పొరుగింట్లో చొరబడిన పామును పట్టుకున్నాడు. అనంతరం ఆ పామును మెడలో వేసుకుని గ్రామస్తులకు చూపించాడు. అలాగే ఒక పాప మెడలో కూడా దానిని వేశాడు. చాలా విష పూరితమైన ఆ పామును పట్టుకుని రెండు గంటలపాటు దానితో ఆడి వీడియోలు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో అది అతడ్ని కాటు వేసింది.
మరోవైపు దేవేంద్ర మిశ్రా ఆసుపత్రికి వెళ్లకుండా సొంతంగా నాటు వైద్యం చేసుకున్నాడు. దీంతో పాము కాటు వేసిన కొన్ని గంటల తర్వాత శనివారం రాత్రి అతడు మరణించాడు. కాగా, అతడు ఒక పాత్రలో ఉంచిన ఆ పాము కూడా కొన్ని గంటల తర్వాత చనిపోయిందని గ్రామస్తులు తెలిపారు.