లక్నో : ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హయంలో పలు నగరాల పేర్ల మార్పు కొనసాగుతున్నది. ఇప్పటికే యోగి ప్రభుత్వం అలహాబాద్ పేరును ప్రయాగ్రాజ్గా, ఫైజాబాద్ జిల్లా పేరును అయోధ్య మార్చింది. తాజాగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో పేరు మార్పు సైతం చర్చలు జరుగుతున్నది. అయితే, ఇటీవల యోగి చేసిన ట్వీట్తోనే పేరు మార్పుపై చర్చకు దారి తీసింది. ప్రధాని నరేంద్ర మోదీ లక్నో పర్యటనకు వచ్చిన సందర్భంలో యోగి ట్వీట్ చేశారు. ‘శేషావతార ప్రభు లార్డ్ లక్ష్మణ్జీ పవిత్రమైన నగరమైన లక్నోలోకి మీకు స్వాగతం’ అంటూ ట్వీట్ చేశారు. దీంతో లక్నో నగరంపై పేరు మార్పుపై చర్చ సాగుతున్నది. యోగి ట్వీట్ తర్వాత ‘లక్ష్మణ్పురి’ హ్యాష్ట్యాగ్ సైతం ట్విట్టర్లో ట్రెండ్ అయ్యింది.
ప్రస్తుతం లక్నో పేరును లక్ష్మణ్నగరి, లక్ష్మణ్పురిగా మార్చనున్నట్లు చర్చ జరుగుతుంది. అయితే, లక్ష్మణుడికి లక్నోకు సంబంధం ఏమిటన్నది అందరి మదిలో ప్రశ్న తలెత్తుతున్నది. అలాగే పేరు మార్పునకు గల కారణాలు ఏంటీ? అన్న చర్చ జరుగుతున్నది. అయితే, లక్నో పేరును లక్ష్మణ్నగరిగా కాకుండా.. లక్ష్మణపురిగా మార్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు లక్ష్మణ్నగరి కాకుండా లక్ష్మణ్పురిగా మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది.
2018లో ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్గా ఉన్న సీనియర్ బీజేపీ నేత కల్రాజ్ మిశ్రా లక్నో పేరును లక్ష్మణ్పురిగా మార్చాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత లాల్జీ టాండన్ రాసిన ‘ఉన్కహా లక్నో’ పుస్తకం తర్వాత ఆయన వ్యాఖ్యలు చేశారు. టాండన్ ఈ పుస్తకంలో త్రేతాయుగానికి చెందిన రాముడు సోదరుడైన లక్ష్మణుడికి, లక్నోకు ఉన్న సంబంధాన్ని గురించి ప్రస్తావించారు. టాండన్ తన పుస్తకంలో లక్నోను గతంలో లక్ష్మణ్పూర్, లక్ష్మణావతి అని పిలిచేవారని, ఆ తర్వాత లక్నోతి, లఖన్పూర్ అని పిలిచారని, ఆ తర్వాత లక్నోగా పిలుస్తున్నట్లు పేర్కొన్నారు.
లక్నో చరిత్ర వేదకాలం నాటిదని బీజేపీ నేత పేర్కొన్నారు. రామాయణ కాలంలో లక్ష్మణుడు లక్ష్మణపురిని స్థాపించాడని, ఆ కాలం నాటి లక్ష్మణగుట్ట కాలక్రమేణా ఆనవాళ్లు కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే, గుట్టను తవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లక్ష్మణ్ తిల నేడు పూర్తిగా మారి పోయిందని, ఈ ప్రాంతాన్ని ఇప్పుడు వలీ మసీదుగా పిలుస్తున్నారని పేర్కొన్నారు. లాల్జీ టాండన్ వాదనలను ఆ సమయంలో నగరానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డీపీ తివారీ సైతం సమర్థించారు.
రామాయణంలోని ఉత్తర కాండాన్ని ప్రస్తావిస్తూ, అందులో ఇలాంటి అనేక ఆధారాలు ఉన్నాయని, లక్ష్మణుడు గుట్టను చేరుకునేందుకు గోమతీ నదిని దాటాడని పేర్కొంటున్నారు. తివారీ ప్రకారం, లక్ష్మణ్ తిల ప్రాంతంలో ఔరంగాజేబ్ ఓ మసీద్ను నిర్మించాడని, ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే.. లక్ష్మణుడితో నగరానికి ఉన్న అనుంబంధానికి సంబంధించి ఆధారాలు తెరపైకి వస్తాయని పేర్కొన్నారు.