లక్నో: డెంగ్యూ బారిన పడిన బాలికను ఆసుపత్రిలో చేర్చుకోవడంపై సిబ్బంది నిర్లక్షం వహించారు. దీంతో ఆ బాలిక మరణించింది. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో ఈ విషాద ఘటన జరిగింది. ఐదేండ్ల సవన్య గుప్తాకు జ్వరం ఎక్కువగా ఉండటంతో సోమవారం ఉదయం 8 గంటలకు ఫిరోజాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పాప పరిస్థితి బాగా లేదని వెంటనే అడ్మిట్ చేసి చికిత్స అందించాలని కుటుంబ సభ్యులు అక్కడి వైద్య సిబ్బందిని ఎంతో ప్రాధేయపడ్డారు. అయినప్పటికీ సిబ్బంది పట్టించుకోక నిర్లక్ష్యం వహించారు.
వైద్యులను, సిబ్బంది వెంటపడగా చివరకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేర్చుకున్నారు. అనంతరం కొంత సేపటికే ఆ పాప చనిపోయినట్లు తెలిపారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. తన చెల్లికి సకాలంలో వైద్యం అంది ఉంటే బతికి ఉండేదని సోదరుడు వాపోయాడు. ఇక్కడ డబ్బులు ఇస్తేనే వైద్యులు చికిత్స అందించే పరిస్థితి ఉన్నదని మరొక బంధువు ఆరోపించారు.
కాగా, ఉత్తరప్రదేశ్లో డెంగ్యూ కేసులు, మరణాల పెరుగుదలపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఫిరోజాబాద్లో గత రెండు వారాల్లో 60 మందికిపైగా మరణించారు. గత 48 గంటల్లో 16 మంది చనిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేక చాలా మంది డెంగ్యూ రోగులు చనిపోతున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమని బీఎస్పీ అధినేత్రి మాయావతి విమర్శించారు.