BJP Leader | లక్నో : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నేతలు అరాచకాలు సృష్టిస్తున్నారు. భూకబ్జాలకు పాల్పడుతూ రైతుల ప్రాణాలను బలిగొంటున్నారు. తాజాగా ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బీజేపీ నాయకుడు భూకబ్జా చేయడం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు రైతు.
వివరాల్లోకి వెళ్తే.. కాన్పూర్ జిల్లా చకేరి గ్రామానికి చెందిన బాబు సింగ్ యాదవ్ తనకున్న పొలంలో పంటలు పండిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. యాదవ్ భూమిపై స్థానిక బీజేపీ నాయకుడి కన్నుపై పడింది. యాదవ్కున్న 6.5 బిగాల భూమిని బీజేపీ నాయకుడు దివాకర్ కబ్జా చేశాడు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు యాదవ్కు ఇబ్బందిగా మారింది. దిక్కుతోచని స్థితిలో వేగంగా వస్తున్న రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైతు యాదవ్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టంకు తరలించారు. ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తన పేరిట ఉన్న 6.5 బిగాల అగ్రికల్చర్ ల్యాండ్కు రూ. 6.29 కోట్ల నకిలీ చెక్కులు ఇచ్చి, దివాకర్ బలవంతంగా కబ్జా చేశాడని లేఖలో పేర్కొన్నాడు. ఇలాంటి చర్యలను కట్టడి చేయాలని సీఎం యోగికి అభ్యర్థించాడు. మీ సొంత పార్టీ నాయకులే రూల్స్ను బ్రేక్ చేస్తున్నారని తెలిపాడు. వీలైతే తన పిల్లలకు న్యాయం చేయాలని యోగిని కోరాడు రైతు.