లక్నో: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ఇప్పటికే విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రజల దృష్టిని తమవైపు మరల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా, మాజీ ముఖ్యమంత్రి, ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఓ అబద్ధాల మెషిన్ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యా అన్నారు. కాగా, వచ్చే ఎన్నికల్లో అఖిలేశ్ పోటీ చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్లో ప్రతిఒక్కరికి 300 యూనిట్లలోపు విద్యుత్ను ఉచితంగా అందిస్తామని అఖిలేశ్ యాదవ్ ప్రకటించారు. ఇది సాధ్యం కాదని, అతనో అబద్ధాల యంత్రమని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంతో అఖిలేశ్ అటోమెటిక్ మెషిన్గా మారారని చెప్పారు. తన పరిపాలనా కాలంలో రాష్ట్రంలో విద్యుత్, కరెంటు స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు అన్నీ అపహరణకు గురయ్యాయని ఆరోపించారు. ఇప్పుడు అందరికి ఉచితంగా కరెంటు ఇస్తామంటున్నారని మౌర్యా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్తోపాటు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్హహణకు రంగం సిద్ధమయింది. 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 10 నుంచి మార్చి 3 వరకు ఏడు విడుతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు పార్టీలు మొదటి విడత ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించాయి.