నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్లో బీజేపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. యోగి క్యాబినెట్ మంత్రి, ఓబీసీ కీలక నేత స్వామి ప్రసాద్ మౌర్య, మరో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి 24 గంటలు గడవకముందే మరో మంత్రి, ఓబీసీ నేత దారాసింగ్ చౌహాన్ తన పదవికి రాజీనామా చేశారు. మరో ఎమ్మెల్యే అవతార్సింగ్ బదానా కూడా కాషాయపార్టీకి గుడ్బై చెప్పి ఆర్ఎల్డీలో చేరారు. బీజేపీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్యపై బుధవారం అరెస్ట్ వారంట్ జారీ అయింది. 2014నాటి కేసులో స్థానిక కోర్టు ఈ వారంట్ జారీచేసింది.
లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్లో బీజేపీకి మరో ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత, అటవీ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ‘దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగుల పట్ల యోగి సర్కారు చూపిస్తున్న నిర్లక్ష్యం నన్ను ఎంతగానో కలిచివేసింది. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు, దళితుల కోటా విషయంలో బీజేపీ తీవ్ర అన్యాయం చేస్తున్నది. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను హైకమాండ్ దృష్టికి కూడా తీసుకెళ్లా. వాళ్లు నా మాటలను పట్టించుకోలేదు. అందుకే మంత్రిగా రాజీనామా చేస్తున్నా’ అని చౌహాన్ వెల్లడించారు. రాజీనామా లేఖను గవర్నర్ ఆనందీబెన్ పటేల్కు పంపించారు. బీజేపీ ఎమ్మెల్యే అవతార్ సింగ్ భదానా కూడా బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. జయంత్ చౌదరి నేతృత్వంలోని ఆరెల్డీలో చేరారు. కాషాయ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు ప్రకటించిన మరుసటి రోజే చౌహాన్తో పాటు అవతార్.. బీజేపీని వీడటం ఆ పార్టీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నది.
హృదయపూర్వక స్వాగతం
బీజేపీని వీడుతున్నట్టు చౌహాన్ ప్రకటించగానే సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. ఆయన్ని పార్టీలోకి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్టు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పాటుపడే చౌహాన్ లాంటి వ్యక్తులతో కలిసి ఎస్పీ, దాని మిత్రపక్షాలు వివక్షను నిర్మూలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ పార్టీలో అందరికీ గౌరవంతో పాటు, సముచిత చోటు కూడా ఉంటుందన్నారు. ఈ మేరకు ట్విట్టర్లో చౌహాన్తో దిగిన ఫొటోను అఖిలేశ్ పోస్ట్ చేశారు. అయితే, ఎస్పీలో చేరుతారా? అన్న మీడియా ప్రశ్నకు చౌహాన్ స్పందిస్తూ.. తన మద్దతుదారులతో చర్చించిన తర్వాతనే భవిష్యత్తు కార్యచరణపై నిర్ణయం తీసుకొంటానని పేర్కొన్నారు.
కొనసాగుతున్న బుజ్జగింపులు
దారా సింగ్ చౌహాన్ను బుజ్జగించడానికి యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య రంగంలోకి దిగారు. ‘కుటుంబసభ్యుడు ఇంటి నుంచి వెళ్లిపోతే అది ఎంతో బాధ కలిగిస్తుంది. గౌరవనీయులైన నాయకులారా.. నేను మీకు చెప్పేది ఒక్కటే. మునిగిపోతున్న పడవలో ప్రయాణించవద్దు. పెద్దన్నయ్య దారా సింగ్, నా విజ్ఞప్తిని పరిగణించాలని కోరుకొంటున్నా’ అని మౌర్య పేర్కొన్నారు.
ఏవరీ చౌహాన్?
అటవీ, పర్యావరణ శాఖ మంత్రి దారా సింగ్ చౌహాన్ యూపీలో బలమైన ఓబీసీ నేత. మధుబన్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో బీఎస్పీ నుంచి ఎంపీగా పనిచేశారు. 2015లో బీజేపీలో చేరారు. దళితులు, వెనుకబడిన సామాజిక వర్గాల అభివృద్ధికి కృషిచేశారు. దీంతో ఆయా వర్గాల్లో ఈయనకు మంచి గుర్తింపు ఉన్నది.
నిన్న రాజీనామా.. నేడు అరెస్టు వారంట్
యోగి క్యాబినెట్ నుంచి వైదొలిగిన స్వామి ప్రసాద్ మౌర్యపై బుధవారం అరెస్టు వారంట్ జారీ అయింది. ఈ మేరకు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేవుళ్ల పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మౌర్యపై 2014లో ఓ కేసు నమోదైంది. దీంట్లో భాగంగా బుధవారం ఆయన కోర్టు విచారణకు హాజరు కావాల్సి ఉన్నది. అయితే, విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు మౌర్యపై అరెస్టు వారంటు జారీ చేసింది.
బీజేపీలో ప్రకంపనలు
తన రాజీనామా బీజేపీలో ప్రకంపనలు సృష్టించిందని మంత్రి పదవికి రాజీనామా చేసిన స్వామి ప్రసాద్ మౌర్య తెలిపారు. శుక్రవారం తాను అధికారికంగా ఎస్పీలో చేరనున్నట్టు ప్రకటించారు. బీజేపీలోకి తిరిగి చేరే ప్రసక్తే లేదని, ప్రజాసమస్యలపై దృష్టిసారిస్తే ఆ పార్టీకి ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. మంగళవారం మౌర్య మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సమయంలో బీజేపీ అగ్రనేతలు ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశమైనట్టు సమాచారం. రానున్న యూపీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాను ఖరారు చేయడంలో ఆ నేతలు నిమగ్నమయ్యారని, సుమారు 10 గంటల పాటు ఈ చర్చలు జరిగాయని తెలుస్తున్నది.
అయోధ్య నుంచి యోగి!
వచ్చే ఎన్నికల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్య నుంచి పోటీచేసే అవకాశమున్నట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై తుది నిర్ణయం బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ తీసుకొంటుందని వెల్లడించాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యే నరేశ్ సైనీ, ఎస్పీ ఎమ్మెల్యే హరి ఓం యాదవ్ బుధవారం బీజేపీలో చేరారు. తొలి, రెండో విడుత యూపీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను ఒకట్రెండు రోజుల్లో విడుదల చేస్తామని ఎస్పీ కూటమి వెల్లడించింది.