లక్నో : అయోధ్యలోని ప్రముఖ క్రాస్రోడ్స్లో ఒక రహదారికి లెజెండరీ గాయని దివంగత లతా మంగేష్కర్ పేరు పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ హామీ ఇచ్చారు. కస్గంజ్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ సీఎం ఈ వాగ్ధానం చేశారు. ముంబై ఫిల్మ్ సిటీని తాము ఇక్కడకు తీసుకువస్తున్నామని, స్ధానిక యువతకు సినిమాల్లో పనిచేసే అవకాశం లభిస్తుందని అన్నారు. భారత రత్న లతా మంగేష్కర్ జ్జ్ఞాపకార్ధం తాము ఓ అకాడమీ నిర్మించాలని నిర్ణయించామని చెప్పారు. ఎలాంటి వివక్ష చూపకుండా అందరికీ సంక్షేమ పధకాలు అందిస్తామని యోగి హామీ ఇచ్చారు. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు వారసత్వ రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.
ఈ పార్టీలు వారి కుటుంబం కోసమే బతుకుతాయని, వారసత్వ రాజకీయాలను ప్రోత్సహిస్తాయని అన్నారు. తాము జాతీయవాదం గురించి మాట్లాడితే విపక్షాలు కులం గురించి మాట్లాడతాయని అన్నారు. తాము అభివృద్ధి గురించి చర్చిస్తే వారు మతం, స్మశానాల గురించి చర్చ పెడతారని దుయ్యబట్టారు. తాము గన్నా (చెరుకు) గురించి మాట్లాడితే వారు జిన్నా గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. ఇక కస్గంజ్లో ప్రచార పర్వంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యలోని ఓ చౌక్కు లతా మంగేష్కర్ పేరును పెడతామన్న యోగి ప్రకటనను స్వాగతించారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు 11 జిల్లాల్లో విస్తరించిన 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం జరిగిన తొలి దశ పోలింగ్లో 60.17 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుండగా, యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుంటూ అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ చెమటోడుస్తోంది. మరోవైపు ప్రియాంక గాంధీ ఇమేజ్తో ఉనికి చాటుకోవాలని కాంగ్రెస్ కసరత్తు సాగిస్తుండగా..దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో సత్తా చాటాలని మాయావతి సారధ్యంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.