లక్నో : ఆజంఘఢ్ పేరును ఆర్యంఘఢ్గా మార్చనున్నట్టు యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ సంకేతాలు పంపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి ఆజంఘఢ్లో ర్యాలీలో యోగి ఆదిత్యానాధ్ పాల్గొన్నారు. అంతకుముందు ఆజంఘఢ్ యూనివర్సిటీ శంకుస్ధాపన కార్యక్రమం సందర్భంగా ట్వీట్ చేస్తూ పేరు మార్పుపై సంకేతాలు పంపారు. ఆజంఘఢ్ పేరును ఆర్యంఘఢ్గా మారుస్తామని..దీనిపై ఎలాంటి సందేహాలు లేవని యోగి స్పష్టం చేశారు.
ఇక యోగి ఆదిత్యానాధ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నగరాల పేర్లు మార్చేస్తున్నారని సమాజ్వాదీ పార్టీ ఆరోపించింది. ఆజంఘఢ్లో అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు యోగి, అమిత్ షా వెళ్లారని..గత నాలుగున్నర ఏండ్లలో ఆ ప్రాంతానికి ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు.
సీఎం ఎలాంటి పనులను ప్రారంభించలేదని, ఆయన మాటలను ఎవరూ నమ్మే పరిస్ధితి లేదని ఎద్దేవా చేశారు. పేర్లు, రంగులు మార్చడం మాత్రమే సీఎం యోగికి తెలుసని, ఈసారి ప్రజలు ఏకంగా ఆయన ప్రభుత్వాన్నే మార్చేస్తారని అఖిలేష్ అన్నారు.