లక్నో : ఒమిక్రాన్ కేసుల పెరుగుదల ఆందోళన రేకెత్తిస్తుంటే ఇది సాధారణ వైరల్ ఫీవరేనని యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ తేల్చేశారు. 15-18 ఏండ్ల చిన్నారుల వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని తనిఖీ చేసిన అనంతరం యోగి మీడియాతో మాట్లాడుతూ ఒమిక్రాన్ సాధారణ వైరల్ జ్వరమేనని, అయితే ఈ వైరస్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోందన్నది వాస్తవమని, అయితే కరోనా సెకండ్ వేవ్తో పోలిస్తే ఇది ఒకింత బలహీనమైనదని అన్నారు. ఒమిక్రాన్ కేవలం ఓ సాధారణ వైరల్ ఫీవర్ వంటిదేనని అన్నారు. ఏ వ్యాధి విషయంలోనైనా జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరమని స్పష్టం చేశారు.
ఒమిక్రాన్తో భయపడాల్సిన పనిలేదని, డెల్టా బారినపడిన వారు కోలుకునేందుకు 15-25 రోజుల సమయం పట్టేదని, రీఇన్ఫెక్షన్ రిస్క్ అధికమని, అయితే ఒమిక్రాన్తో ఇప్పటివరకూ అలాంటిదేమీ లేదని చెప్పారు. వైరస్ బలహీనపడిందని, అయితే ఇతర వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలని యోగి సూచించారు. యూపీలో ఇప్పటివరకూ 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని వీరిలో ముగ్గురు కోలుకోగా మిగిలిన వారు హోం ఐసోలేషన్లో ఉన్నారని చెప్పారు.