UP Cabinet : ఉత్తర ప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఆధ్వర్యంలోని బీజేపీ కూటమి ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. ఆదివారం ఆరుగురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజధాని లక్నోలోని జన్ భవన్లో ఆరుగురి చేత గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. భూపేంద్ర చౌదరి, మనోజ్ పాండే, క్రిష్ణ పాశ్వాన్, కైలాష్ సింగ్ రాజ్పుత్, హన్స్రాజ్ విశ్వకర్మ, సురేంద్ర దైలర్ మంత్రులుగా ప్రమాణం చేశారు.
వీరిలో భూపేంద్ర చౌదరి, మనోజ్ పాండేకు క్యాబినెట్ హోదా దక్కింది. అలాగే, మంత్రివర్గంలో మార్పులు కూడా చేపట్టారు యోగి ఆదిత్యనాథ్. ఇప్పటికే మంత్రులుగా ఉన్న అజిత్ సింగ్ పాల్, సోమేంద్ర తోమర్లకు స్వతంత్ర మంత్రులుగా అవకాశం కల్పించారు. ఉత్తర ప్రదేశ్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మంత్రివర్గ విస్తరణ చేపట్టి, పలువురికి అవకాశం కల్పించారు. యోగి 2.0లో 2024లో చేపట్టిన మంత్రివర్గ విస్తరణ తర్వాత మళ్లీ మంత్రివర్గాన్ని విస్తరించడం ఇదే మొదటిసారి.
ఈసారి మంత్రివర్గ విస్తరణలో కూటమి పార్టీలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఎస్బీఎస్పీ అధినేత ఓం ప్రకాష్ రాజ్బార్, ఆర్ఎల్డీ నేతలు అనిల్ కుమార్, సునీల్ కుమార్ శర్మ, దారా సింగ్ చౌహాన్లకు క్యాబినెట్ పదవులు దక్కాయి. అయితే, ఈ మంత్రివర్గ విస్తరణపై ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ విమర్శలు గుప్పించారు. ఇది కాలక్షేపం కోసం చేసే ప్రక్రియగా అభివర్ణించారు.