లక్నో : ఉత్తరప్రదేశ్లోని అమాపూర్ నియోజకవర్గానికి చెందిన భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే దేవేంద్ర ప్రతాప్ సింగ్(55) సోమవారం ఉదయం కన్నుమూశారు. ప్రతాప్ సింగ్ గుండెపోటుతో మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవాళ తెల్లవారుజామున ఇంట్లోనే ప్రతాప్ సింగ్ కుప్పకూలడంతో.. ఆయనను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఎమ్మెల్యే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం అందుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు విపిన్ వర్మ డేవిడ్, వీరేంద్ర లోధి ఆస్పత్రికి చేరుకుని ప్రతాప్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే భౌతికకాయాన్ని సొంతూరుకు తరలించారు. ఎమ్మెల్యే ప్రతాప్ మృతిపట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రతాప్ సింగ్ అమాపూర్ నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.