లక్నో, జనవరి 13: ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కీలక సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీని వీడుతుండటం యోగి సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. యూపీ ఆయుష్, ఫుడ్ సెక్యూరిటీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సహాయమంత్రి (స్వతంత్ర హోదా), ఓబీసీ కీలక నేత ధరంసింగ్ సైనీ మంత్రివర్గానికి గురువారం రాజీనామా చేశారు. బీజేపీ ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన వర్గాలు, రైతులు, నిరుద్యోగులు, చిన్న వ్యాపారులు అన్యాయానికి గురయ్యారని, అందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ ఆనందీబెన్ పటేల్కు పంపించారు. సైనీ రాజీనామా వార్తలు వెలువడగానే సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్.. ఆయనతో దిగిన ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘సామాజిక న్యాయం కోసం పోరాడుతున్న మరో యోధుడు డాక్టర్ ధరంసింగ్ సైనీ. ఆయనకు ఎస్పీ ఆహ్వానం పలుకుతున్నది. ఆయన రాకతో సానుకూల, ప్రగతిశీల రాజకీయాలకు కొత్త ఉత్తేజం రావడంతో పాటు అవి మరింత బలోపేతం అవుతాయి’ అని పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే, శికొహాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖేశ్ వర్మ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఇటీవల పార్టీని వీడిన స్వామి ప్రసాద్ మౌర్య నేతృత్వంలో పనిచేస్తానన్నారు. దళితులు, ఓబీసీలకు బీజేపీ హయాంలో అన్యాయం జరుగుతున్నదన్న కారణంగానే మంత్రి పదవులకు రాజీనామా చేస్తున్నట్టు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్ కూడా ఇటీవల పేర్కొనడం తెలిసిందే. కాగా 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఫిబ్రవరి 10-మార్చి 7 మధ్య ఏడు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
20 వరకు షాకులే
ఈ నెల 20వ తేదీ వరకు యూపీ బీజేపీకి మంత్రులు, ఎమ్మెల్యేలు షాక్ ఇస్తూనే ఉంటారని ధరంసింగ్ సైనీ చెప్పారు. రోజుకు సగటున కనీసం ఒక మంత్రి, ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల చొప్పున రాజీనామా చేయనున్నట్టు పేర్కొన్నారు. ఎస్పీలో చేరనున్నారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. శుక్రవారం మరోదఫా చర్చలు జరుపాల్సి ఉన్నదని, అనంతరం ఆ విషయాన్ని వెల్లడిస్తానని పేర్కొన్నారు. కాగా, ధరంసింగ్ సైనీ, ముఖేశ్ వర్మ ఎస్పీలో చేరడం దాదాపుగా ఖరారైనట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. మరికొంత మంది కీలక నేతలు బీజేపీని వీడనున్నట్టు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ జోస్యం చెప్పారు. ‘బీజేపీని వీడిన మరో కీలక నేత’ అనే వార్త లేకుండా ఇకపై రోజు గడవబోదని పేర్కొన్నారు. ‘యూపీలో తమదే మళ్లీ అధికారం’ అంటూ 15 రోజులకిందట ధీమా వ్యక్తం చేసిన బీజేపీలో ప్రస్తుతం పరిస్థితులు తారుమారయ్యాయని ఎద్దేవా చేశారు.
కమలదళం ఉక్కిరి బిక్కిరి
మంగళవారం స్వామి ప్రసాద్ మౌర్య.. యోగి మంత్రివర్గానికి రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజు దారాసింగ్ చౌహాన్ కూడా యోగి క్యాబినెట్ నుంచి వైదొలిగారు. వీరితో పాటు అవతార్ సింగ్ భదానా, బ్రిజేష్ కుమార్ ప్రజాపతి, రోషన్ లాల్ వర్మ, భగవతీ సాగర్, వినయ్ షక్యా వంటి ఎమ్మెల్యేలు కూడా కాషాయదళాన్ని వీడారు. ఇప్పుడు తాజాగా మంత్రి ధరం సింగ్ సైనీ, ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ బీజేపీని వీడారు. మూడు రోజుల్లోనే 9 మంది కీలక నేతలు పార్టీని వీడటం కమలదళాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
ఎవరీ ధరంసింగ్ సైనీ?
యూపీలోని సహారన్పూర్ జిల్లాలోని నకుడ్ నియోజకవర్గం నుంచి ధరంసింగ్ సైనీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనకు ఓబీసీ వర్గాల్లో గట్టి పట్టు ఉన్నది.
172 మంది అభ్యర్థుల ఖరారు!
యూపీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ గురువారం ఖరారు చేసింది. 172 స్థానాలకు గానూ ఈ జాబితాను ఎంపిక చేసింది. సీఎం యోగి.. అయోధ్య నుంచి, డిప్యూటీ సీఎంలు కేశవ్ ప్రసాద్ మౌర్య, దినేశ్ శర్మ వరుసగా సిరాథు, లక్నో నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్టు సమాచారం. మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మిత్రపక్షాలైన అప్నాదళ్, నిషద్ పార్టీతో సీట్ల పంపకాలపై బీజేపీ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తున్నది.
నా స్థైర్యాన్ని దెబ్బతీయలేరు: మౌర్య
యూపీ మంత్రివర్గానికి రాజీనామా చేసిన మరుసటి రోజే 8 ఏండ్ల నాటి కేసు తిరగదోడి తనపై నాన్-బెయిలబుల్ వారంట్ జారీచేశారని స్వామి ప్రసాద్ మౌర్య గురువారం ఆరోపించారు. తనను బీజేపీ ఎన్ని విధాలుగా ఇబ్బందులకు గురిచేస్తుందో.. అంత బలంగా ఆ పార్టీని ఓడిస్తానని పేర్కొన్నారు. ‘8 ఏండ్లనాటి కేసులో నాపై నాన్-బెయిలబుల్ వారంట్ జారీ చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ఇది జరిగింది. నాపై డజన్ల కేసులు నమోదు చేసినా.. నా ైస్థెర్యాన్ని దెబ్బతీయలేరు. నన్ను ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తారో.. అంత బలంగా మీ పార్టీని (బీజేపీని) ఓడిస్తా’ అన్నారు.