PM Modi | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, మార్చి 31, (నమస్తే తెలంగాణ): గాయపడిన కొంగను రక్షించిన ఒక సామాన్యుడిపై యూపీ అధికారులు చట్టాన్ని ప్రయోగించి కేసు పెట్టారు. అది కూడా ఆ కొంగను సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ సందర్శించిన తర్వాతే. కానీ ప్రధాని మోదీ తన నివాసంలో దేశ జాతీయ పక్షి నెమలిని పెంచుకోవడంపై అధికారులెవరూ నోరు మెదపడం లేదు. దీనిని ప్రజలు విమర్శిస్తున్నారు.
అమేథి జిల్లా మందకా గ్రామానికి చెందిన ఆరిఫ్ అనే రైతుకు కొంత కాలం క్రితం పొలంలో గాయపడిన కొంగ కనిపించింది. కొంగ పరిస్థితికి చలించిపోయిన అరిఫ్ దానిని ఇంటికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. నెల పాటు కొంగను తన ఇంట్లోనే ఉంచుకొని కంటికి రెప్పలా కాపాడారు. కొంగ పూర్తిగా కోలుకోవడంతో ఇక మునపటిలా ఎగిరిపోగలదన్న నమ్మకం కలిగాక ఆరిఫ్ దానిని పొలం వద్దకు తీసుకెళ్లి వదిలేశారు. కానీ ఆరిఫ్ కుటుంబం తన పట్ల చూపిన ఆదరాభిమాన్ని వదిలిపెట్టలేక ఆ కొంగ సాయంత్రం ఆరిఫ్ ఇంటికే తిరిగి వచ్చేసింది. ఆరిఫ్ ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్లేది. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో యూపీ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ కొంగను సొంత పిల్లలతో సమానంగా సాకుతున్న ఆరిఫ్ కుటుంబాన్ని అభినందించారు. అప్పటి నుంచే ఆరిఫ్కు కష్టాలు ప్రారంభమయ్యాయి. కొంగ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పక్షి అనే విషయం ఆరిఫ్కు తెలియదు. రాష్ట్ర పక్షిని ఇంట్లో బంధించడమేమిటని ఆటవీశాఖ అధికారులు ఆరిఫ్ ఇంటికి వచ్చి కొంగను రాయబరేలి వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. కొంగను అక్రమంగా ఇంట్లో బంధించిన నేరంపై అతడికి సమన్లు జారీ చేశారు. అఖిలేశ్ యాదవ్కు ఈ విషయం తెలిసి అటవీశాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆరిఫ్ ఇంటి నుంచి తీసుకెళ్లిన తర్వాత సదరు కొంగ ఆహారం తినకపోవడంతో నీరసించిందని అటవీశాఖ అధికారులే వాపోయారు. కానీ ఆరిఫ్కు ఇచ్చిన సమన్లను ఉపసంహరించడానికి ఉత్తరప్రదేశ్ సర్కార్ ససేమిరా అంగీకరించడం లేదు. కొంగకు ఏమైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని అఖిలేశ్ హెచ్చరించారు. ఆరిఫ్ చేసింది నేరమే అయితే మరి ప్రధాని మోదీ తన నివాసంలో పెంచుకుంటున్న నెమళ్ల సంగతేంటి? ఆయనకు కూడా నోటీసు ఇస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.