లక్నో, మార్చి 21: దేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల జాబితాలో యూపీ మూడో స్థానంలో ఉన్నది. ఈ మేరకు నీతిఆయోగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (ఎంపీఐ) నివేదిక వెల్లడించింది. పేదరికం ఎక్కువగా ఉన్న రాష్ర్టాల్లో తొలిస్థానంలో బీహార్ ఉండగా, జార్ఖండ్ రెండోస్థానంలో ఉన్నది. శిశుమరణాలు, పిల్లల్లో పోషకాహార లోపం ఎక్కువగా ఉన్న రాష్ట్రంగానూ, గర్భిణులకు సరైన ఆరోగ్య సేవలు అందని రాష్ట్రంగానూ యూపీ నిలిచింది. ఇలా నాలుగు పెరామీటర్లలో యూపీ అధోస్థానంలో ఉన్నది. ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం సంయుక్తంగా రూపొందించిన పద్ధతినే ఎంపీఐ మదింపునకు ఉపయోగించినట్టు నీతిఆయోగ్ తన నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక గతేడాది నవంబర్లో విడుదలైంది. బీజేపీ చెబుతున్నట్టు డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో రాష్ర్టాలకు ఒరిగేదేమీ లేదని నీతిఆయోగ్ నివేదికతో రుజువవుతున్నది.