UNO : పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Terror Attack) ని భారత్ సహా యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండిస్తోంది. ఐక్యరాజ్యసమితి కూడా ఈ దాడిని హేయమైనదిగా అభివర్ణించింది. జమ్ముకశ్మీర్లో ఆందోళనకర పరిస్థితిని ఐక్యరాజ్యసమితి (United Nations) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ (Antonio Guterres) నిశితంగా పరిశీలిస్తున్నారని ఐరాస అధికార ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ తెలిపారు. ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోందన్న ఆయన ప్రస్తుతం ఇరుదేశాలు సంయమనం పాటించాలని సూచించారు.
‘జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ఐరాస తీవ్రంగా ఖండిస్తోంది. పౌరులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. గుటెర్రస్ ఈ ఆందోళనకర పరిస్థితిని నిశితింగా పరిశీలిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ దేశాలు సంయమనం పాటించాలని కోరుతున్నాం. ఇరుదేశాల మధ్య ఏదైనా సమస్య ఉంటే శాంతియుత చర్చలతో వాటిని పరిష్కరించుకుంటారని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఉగ్రదాడికి ప్రతిగా సింధూ నదీ జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేయడంపై మీడియా ప్రశ్నించగా.. ఈ ఉద్రిక్తతల వేళ ఇరుదేశాలు సంయమనం పాటించి, పరిస్థితులు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నామని చెప్పారు.
గత మంగళవారం మధ్యాహ్నం పహల్గాంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. మరికొందరు ప్రాణాలతో తప్పించుకున్నారు.