కోల్కతా: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, గవర్నర్ సీవీ ఆనందబోస్ మధ్య రాజుకున్న యూనివర్సిటీ చాన్సలర్ వివాదం మరింత ముదిరింది. రాష్ట్రంలోని యూనివర్సిటీలపై బెంగాల్ ప్రభుత్వ పెత్తనాన్ని తగ్గించేలా తాజాగా గవర్నర్ మరో నోటిఫికేషన్ జారీ చేశారు. యూనివర్సిటీల బోధన, బోధనేతర సిబ్బంది తనకు జవాబుదారీగా ఉండాలని, తన మాటకు కట్టుబడి ఉండాలని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. గవర్నరే.. యూనివర్సిటీల చాన్సలర్ అని అందులో స్పష్టం చేశారు. యూనివర్సటీలకు ప్రభుత్వం సూచనలు ఇవ్వవచ్చని, కానీ సూచనలకు యూనివర్సిటీలు కట్టుబడి ఉండవని పేర్కొన్నారు. రాష్ట్ర విద్యా శాఖ ఏదైనా సూచిస్తే.. వైస్ చాన్సలర్ వాటిని క్లియర్ చేశాకే అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇటీవల యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ చాన్సలర్ల స్థానాల్లో తాత్కాలిక వైస్ చాన్సలర్గా తాను వ్యవహరిస్తానని గవర్నర్ పేర్కొనగా.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్తామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బ్రాత్య బసు తెలిపారు. దీంతో గవర్నర్ మరో నోటిఫికేషన్ను తీసుకొచ్చారు.