లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ కారు ప్రమాద ఘటనలో నిందితుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. వారం రోజులుగా ఆచూకీ లేకుండాపోయిన ఆశిష్ను పోలీసులు 12 గంటలపాటు సుదీర్ఘంగా విచారించారు. అనంతరం శనివారం అర్ధరాత్రి అరెస్టు చేశారు. విచారణ సందర్భంగా ఆశిష్ తమకు సహకరించలేదని, దీంతో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ చెప్పారు.
లఖింపూర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుండగా రైతుల పైనుంచి కారు దూసుకెళ్లింది. దీంతో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతిచెందారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఘటన తర్వాత ఆశిష్ మిశ్రా నేపాల్కు పారిపోయాడని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే నాటకీయ పరిణామాల మధ్య ఆయన శనివారం పోలీసుల విచారణకు హాజరయ్యారు.