న్యూఢిల్లీ, డిసెంబర్ 25: తాగుబోతు వ్యక్తితో కూతురు పెండ్లి చేయవద్దని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ సూచించారు. ఉత్తరప్రదేశ్లోని లాంబువా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘పొరపాటున కూడా తాగుబోతుకు పిల్లను ఇవ్వొద్దు. ఎందుకంటే అతడికి తాగుడే లోకం.. పెండ్లం, పిల్లల గురించి పట్టింపు ఉండదు. తాగుబోతుకన్నా రిక్షా తొక్కేవాడికో లేదా దినసరి కార్మికుడికో పిల్లను ఇస్తే బాగా చూసుకుంటాడు’ అని సూచించారు. ‘నేను ఎంపీని, నా భార్య ఎమ్మెల్యే.. కానీ ఏం లాభం? నా కొడుకు స్నేహితులతో కలిసి మద్యం తాగేవాడు. ఒకసారి డీ అడిక్షన్ సెంటర్లో చేర్పించా. మద్యం మానేస్తానని చెప్పడంతో పెండ్లి చేశా. కానీ పెండ్లి అయినా కొద్దిరోజులకే మళ్లీ మద్యం తాగడం మొదలుపెట్టాడు. చివరికి ఆ మద్యానికే బలైపోయాడు. నా కోడలు రెండేండ్ల వయసున్న కుమారుడిని ఎత్తుకొని కండ్లముందు వితంతువుగా తిరుగుతుంటే చూడలేకపోతున్నాను. అందుకే ఓ తండ్రిగా, ఓ బాధితుడిగా మీ అందరికీ నా విజ్ఞప్తి ఇదే. పొరపాటున కూడా మీ కూతురిని లేదా చెల్లిని తాగుబోతుకు ఇచ్చి పెండ్లి చేయకండి’ అని కేంద్రమంత్రి కోరారు.