న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆ పార్టీ నేతలు పవన్ ఖేరా, జైరాం రమేశ్, డిసౌజాకు లీగల్ నోటీసు పంపారు. భేషరతుగా లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీసులో డిమాండ్ చేశారు. తక్షణమే వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనయ జోయిష్ ఇరానీ గోవాలో అక్రమంగా బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. స్మృతి కూతురు నడుపుతున్న రెస్టారెంట్ లైసెన్స్ను మే 2021లో చనిపోయిన ఓ వ్యక్తి పేరు మీద జూన్ 2022న తీసుకున్నారని, 13 నెలల క్రితం చనిపోయిన వ్యక్తి పేరు మీద లైసెన్స్ ఎలా తీసుకుంటారు? ఇది అక్రమమే అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా పేర్కొన్నారు.
గోవా నిబంధనల ప్రకారం ఒక రెస్టారెంట్కు ఒక బార్ లైసెన్స్ మాత్రమే ఉండాలని, కానీ.. సిల్లీ సోల్స్ గోవా రెస్టారెంట్ పేరిట రెండు బార్ లైసెన్సులున్నాయని పవన్ ఆరోపించారు. స్మృతి ఇరానీ ప్రమేయం లేకుండానే ఆమె కూతురు లైసెన్స్ పొందడం సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు. వెంటనే ప్రధాని మోదీ స్పందించి కేంద్రమంత్రిని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. అయితే, అంశం దుమారం రేగడంతో స్మృతి ఇరానీ సైతం స్పందించారు. తన కూతురు స్టూడెంట్ అనీ, 18 సంవత్సరాల యువతి గౌరవాన్ని దిగజార్చే సాహసాన్ని ఇద్దరు మధ్య వయస్కులు చేశారని ఆరోపించారు. ‘ఆ అమ్మాయి తప్పు ఏంటంటే.. ఆ అమ్మాయి తల్లి 2014, 2019లో రాహుల్ గాంధీపై అమేథీ నుంచి పోటీ చేయడం. సోనియా, రాహుల్కు వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టడం తప్పు’ అని ఆరోపించారు.