న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ శాంతనూ ఠాకూర్ యూటర్న్ తీసుకొన్నారు. ‘ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా సీఏఏ అమలవుతుంది. ఇది నా గ్యారెంటీ’ అంటూ గత వారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకొన్నారు. తాను నోరు జారానని తాజాగా చెప్పుకొచ్చారు.
సీఏఏ చట్టం నిబంధనల రూపకల్పన ప్రక్రియ వారంలో పూర్తవుతుందని, త్వరలో చట్టం అమలు కానున్నదని చెప్పడం తన ఉద్దేశమని పేర్కొన్నారు. గత నెల 28న పశ్చిమబెంగాల్లో కుల్పిలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. వారం రోజుల్లో రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా సీఏఏ అమలవుతుందని ప్రకటించారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.