Manipur | మణిపూర్లో (Manipur) అల్లర్లు కొనసాగుతున్నాయి. రెండు తెగల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా తయారైంది. బుధవారం ఓ మహిళా మంత్రి ఇంటికి నిప్పుపెట్టిన ఆందోళనకారులు.. తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే రంజన్ సింగ్ (Union Minister RK Ranjan Singh) ఇంటిపై దాడిచేశారు (Attack). ఇంఫాల్లో (Imphal) కర్ఫూ (Curfew) విధించడానికి నిరసిస్తూ.. గురువారం రాత్రి కోంగ్బా (Kongba) ప్రాంతంలో ఉన్న మంత్రి నివాసాన్ని సుమారు 1200 మంది ఆందోళనకారులు చుట్టుముట్టారు. ఇంటిపై పెట్రో బాంబులు (Petrol bombs) విసిరారు. దీంతో ఇళ్లు కాలిపోయింది. అయితే ఆ సమయంలో మంత్రి ఇంట్లో లేరని పోలీసులు వెల్లడించారు.
మంత్రి ఇంటిపై దాడి జరగడం ఇది రెండో సారి. గత నెలలో కూడా ఆందోళనకారులు చుట్టుముట్టగా.. భద్రతా సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపి చెదరగొట్టారు. అయితే రాత్రి జరిగిన దాడిని మాత్రం అడ్డుకోలేకపోయామని ఎస్కార్ట్ కమాండర్ దినేశ్వర్ సింగ్ చెప్పారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత సుమారు 1200 మంది మంత్రి ఇంటిని చుట్టుముట్టారని, అన్ని వైపుల నుంచి పెట్రోల్ బాంబులు విసిరారని తెలిపారు. ఆ సమయంలో ఐదుగురు సెక్కూరిటీ గార్డులు, తొమ్మిది మంది భద్రత సిబ్బంది, మరో ఎనిమిదిమంది అదనపు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
రాష్ట్రంలో మే 3న రెండు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. మైతీ సామాజికవర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడాన్ని నాగాలు, కుకీ సామాజికవర్గానికి చెందినవారు వ్యతిరేకిస్తున్నారు. అల్లర్లు, హింసాత్మక ఘటనల్లో దాదాపు 120మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోగా, 350మందికిపైగా గాయపడ్డారు. ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాలు, ఆస్తులు ధ్వంసమవుతున్నాయి. 50వేలమందికిపైగా ప్రజలు నిరాశ్రయలయ్యారని ప్రభుత్వ వర్గాల సమాచారం.