హుబ్బళ్లి, ఫిబ్రవరి 27: కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జై శంకర్ త్వరలో జరిగే లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తారని మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. అయితే వారిద్దరు ఎక్కడి నుంచి బరిలో నిలుస్తారనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. కర్ణాటకలోని హుబ్బళిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మల, జై శంకర్ల పోటీపై ప్రకటన చేశారు.
ఈ ఇద్దరు నేతలు కర్ణాటక లేదా మరేదైనా రాష్ట్రం నుంచి పోటీచేయవచ్చని, అయితే దీనిపై ఇంకా నిర్ణయించలేదని జోషి అన్నారు. బెంగళూరు నుంచి పోటీ చేస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘ఏమీ ఖరారు కాకుండా నేనెలా సమాధానం చెప్పగలను’ అని బదులిచ్చారు. ప్రస్తుతం నిర్మలా సీతారామన్, జై శంకర్లు వరుసగా కర్ణాటక, గుజరాత్ నుంచి రాజ్యసభ ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.