Bilkis Bano Case | బిల్కిస్ బానో నిందితుల విడుదల కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సమర్థించారు. ‘ప్రభుత్వం, సంబంధిత వ్యక్తులు నిర్ణయం తీసుకున్నప్పుడు ఇది చట్టబద్ధమైన ప్రక్రియ. కాబట్టి నేను దానిలో తప్పును గుర్తించలేదు’ అన్నారు. ‘కొంతకాలం జైలు జీవితం గడిపిన ఖైదీల విడుదల కోసం ఓ నిబంధన ఉన్నది. ఇదంతా చట్టప్రకారం జరుగుతుంది’ అని పేర్కొన్నారు. గుజరాత్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు.
మరో వైపు ఇటీవల కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన పటీదార్ ఉద్యమనేత హార్దిక్ పటేల్ సైతం దోషుల విడుదలకు మద్దతు తెలిపారు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. మరో వైపు నిందితుల విడుదల ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మరో బీజేపీ నేత అల్పేశ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఖైదీల విడుదలను తాను అంగీకరించనని, అలాంటి వ్యక్తులను విడుదల చేసేందుకు సత్ప్రవర్తన ఒక్కటే సరిపోదని, జైలు నుంచి వచ్చిన నిందితులకు స్వీట్లు తినిపించడం సిగ్గుచేటన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించి బిల్కిస్ బానో కేసులో 11 మంది నిందితులను ఇటీవల గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే.
నిందితులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. నిందితులకు రెమిషన్ మంజూరు చేయడంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో గతంలో విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ విషయంలో విచారణకు సంబంధించి రికార్డులు సమర్పించడంతో పాటు దోషులకు మంజూరు చేసిన రెమిషన్ ఆర్డర్ను సమర్పించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సోమవారం గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరమే నిందితులను విడుదల చేసినట్లు అఫిడవిట్లో పేర్కొన్నది. ఈ విషయంపై మంగళవారం సైతం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. వచ్చే నెల 29న విచారణ జరిపేందుకు లిస్ట్ చేసింది.