న్యూఢిల్లీ, మార్చి 4: రిజిస్టర్డ్ గోడౌన్లలో రైతులు నిల్వ చేసుకున్న తమ ఉత్పత్తులపై రుణాలు పొందేందుకు వీలుగా డిజిటల్ ప్లాట్ఫాంను కేంద్ర ఆహారా, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ప్రారంభించారు. అలాగే వేర్హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ (డబ్ల్యుడీఆర్ఏ) త్వరలో వేర్హౌస్ యజమాని చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ను ప్రస్తుతమున్న 3 శాతం నుంచి 1 శాతానికి తగ్గించనున్నట్టు మంత్రి ప్రకటించారు.
ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి గోయల్ ‘ ఈ-కిసాన్, ఉపాజ్ నిధి’ పేరుతో డిజిటల్ గేట్వే ని ప్రారంభించారు. ఇది డబ్ల్యుడీఆర్ఏ కింద నమోదైన గిడ్డంగుల్లో రైతులు నిల్వ చేసిన సరుకుపై బ్యాంకుల నుంచి రుణాలు పొందటానికి సులభమైన మార్గంగా రూపొందనున్నది. ప్రస్తుతం డబ్ల్యూడీఆర్ఏ కింద 5,500 కంటే ఎక్కువ గిడ్డంగులు నమోదై ఉన్నాయి. మొత్తం వ్యవసాయ గిడ్డంగుల సంఖ్య లక్ష వరకు ఉంటుందని అంచనా.
రైతుల ఆదాయాన్ని పెంపొందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించటం ద్వారా భారతీయ వ్యవసాయాన్ని ఆధునీకరించాల్సిన అవసరమున్నదని మంత్రి నొక్కి చెప్పారు. ప్రస్తుతం ప్రారంభించిన గేట్వేతో రైతులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 7 శాతం వడ్డీతో రుణాలు సులభంగా లభిస్తాయని మంత్రి వెల్లడించారు. రైతులు గోదాముల్లో నిల్వ ఉంచిన ఉత్పత్తులను సరైన సమయంలో అమ్ముకోవచ్చని, ఇకపై నష్టాల్లో పంటలను అమ్ముకోవాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.