న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. సాధారణ ప్రజలేకాదు సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకగా తాజాగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి పాజిటివ్ వచ్చింది.
కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ప్రస్తుతం హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నాని తెలిపారు. ఇటీవల తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని, క్వారంటైన్లో ఉండాలని సూచించారు. గతేడాది సెప్టెంబర్లో కూడా ఆయనకు కరోనా సోకింది.
దేశంలో మంగళవారం 1,94,711 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 165 మంది మరణించారు. కరోనా విజృంభణతో దాదాపు పది రోజుల్లోనే రోజువారీ కేసులు రెండు లక్షలకు చేరువయ్యాయి. గత ఏడు రోజుల్లోనే కరోనా కేసుల్లో 70 శాతం పెరుగుదల నమోదవడం గమనార్హం. అయితే మరణాలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి.