Union Minister Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలకు తప్పుడు ప్రాజెక్టు రిపోర్టులే కారణమని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటాగ్రూప్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రోడ్డు ప్రమాదాలపై స్పందించారు. హైవేలు, ఇతర రోడ్ల నిర్మాణానికి వివరణాత్మక ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేసేందుకు కంపెనీలకు అవసరమైన శిక్షణను ఇవ్వాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రి నొక్కి చెప్పారు.
కొత్త టెక్నాలజీని వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదన్నారు. ‘కంపెనీలు తయారు చేసిన కొన్ని డీపీఆర్లు (Detail Project Report) చాలా తప్పుగా ఉన్నాయి. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి’ అన్నారు. ‘కొత్త మెర్సిడెస్ కారు కూడా నైపుణ్యం లేని డ్రైవర్ చేతిలో ఇబ్బందులను కలిగిస్తుంది’ అని మంత్రి పేర్కొన్నారు. రోడ్డు ప్రాజెక్టుల ఆలస్యం కారణంగా నిర్మాణ వ్యయం పెరగడం ఆందోళన కలిగించే విషయమని, దీనికి సైతం కారణాలను గుర్తించాలని నితిన్ గడ్కరీ అన్నారు.
ఇదిలా ఉండగా.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం.. 2021లో భారత్లో 1.55లక్షల మందికిపైగా రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారు. సగటున రోజుకు 426 మందికి.. ప్రతి గంటకు 18 మంది మృతి చెందారు. ఏ క్యాలెండర్ ఇయర్లో ఇంత మొత్తం మరణాలు నమోదవడం అత్యధికం. అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు, క్షతగాత్రుల సంఖ్య తగ్గుముఖం పట్టగా.. ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య గతేడాది గరిష్ఠ స్థాయికి చేరుకుందని హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది.