Narayana Rane | మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె డిమాండ్ చేశారు. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే, 21 మంది ఎమ్మెల్యేలతో సూరత్ క్యాంప్ ఏర్పాటు చేశారు. దీంతో ఉద్ధవ్ ఠాక్రే సారధ్యంలోని సంకీర్ణ కూటమి సర్కార్ మైనారిటీలో పడిందని నారాయణ్ రాణె మంగళవారం అన్నారు. ఏక్నాథ్ షిండే తిరుగుబాటు చేసినా.. తన వైఖరేమిటో వెల్లడించలేదు. కానీ, శివసేన నుంచి బయటకు రావాలని నిర్ణయం తీసుకోవడం సరైన నిర్ణయమేనన్నారు.
శివసేనలో ఏక్నాథ్ షిండేకు, ఉద్ధవ్ ఠాక్రే తగిన గౌరవం ఇవ్వలేదని నారాయణ్ రాణె ఆరోపించారు. షిండే మంత్రిత్వశాఖలో ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే తలదూర్చడంతో శివసేన నుంచి షిండే బయటకు రావాలని నిర్ణయించుకోవడం సరైందేనని నారాయణ్ రాణె అన్నారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో 24 గంటల్లో స్పష్టమైన వైఖరి కనిపిస్తుందన్నారు. ఉద్ధవ్ ఠాక్రేతో కేవలం 11 మంది శివసేన ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్నారు.
మహారాష్ట్ర అసెంబ్లీలో 288 స్థానాలకు గానూ శివసేనకు 55 మంది, ఎన్సీపీకి 53, కాంగ్రెస్ పార్టీకి 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ తరుణంలో షిండే తిరుగుబాటు భావుటా ఎగరేయడంతో మహారాష్ట్ర సంకీర్ణ కూటమి సర్కార్ ఇబ్బందుల్లో చిక్కుకున్నది.