COVID-19 | దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ఆందోళన కలిగిస్తున్నది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులతో సమీక్ష నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా మంత్రులకు కొవిడ్ కట్టడిపై మార్గనిర్దేశనం చేయనున్నారు. బుధవారం ఎంపవర్మెంట్ వర్కింగ్ గ్రూప్ సైతం సమావేశమైంది. నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ రాజీవ్ బహల్, ఇతర సీనియర్ ఆరోగ్య అధికారులు సమావేశానికి హాజరయ్యారు.
మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం (INSACOG) సైతం హాజరుకానున్నది. దేశంలో కొవిడ్ పరిస్థితి, సంసిద్ధతపై చర్చించే అవకాశం ఉన్నది. ప్రస్తుతం దేశంలో కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కారణమని భావిస్తున్నారు. కేసులు పెరుగుతున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా.. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,335 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 20శాతం కొత్త కేసులు పెరిగాయి. గత ఆరు నెలల్లో అత్యధికంగా కేసులు నమోదవడం ఇదేతొలిసారి ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉన్నదని తెలిపింది.