Chandrayaan-4 | భారత్ చంద్రయాన్-4 సన్నాహాలు చేస్తోందని, 2027లో చంద్రయాన్ మిషన్ను ప్రయోగిస్తామని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఈ మిషన్లో చంద్రుడి నమూనాలను భూమిపైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మిషన్లో ఎల్వీఎం 3 రాకెట్ వేర్వేరు ప్రయోగాల తర్వాత.. ఐదు వేర్వేరు భాగాలను మూసుకువెళ్లి స్పేస్లో అనుసంధానించనున్నట్లు తెలిపారు. వీటిని భూమి కక్ష్యలో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. చంద్రుడి ఉపరితల నమూనాలను సేకరించి.. తిరిగి భూమికి చేరుకోవడమే చంద్రయాన్-4 మిషన్ లక్ష్యమని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. గగన్యాన్ మిషన్ వచ్చే ఏడాది ప్రయోగించనున్నట్లు తెలిపారు. భారతీయ వ్యోమగాములను ప్రత్యేకం వాహనంలో భూమి దిగువ కక్ష్య వరకు పంపి.. తిరిగి సురక్షితంగా భూమిపైకి తీసుకురానున్నట్లు చెప్పారు.
2026లో భారత్ సముద్రయాన్ ప్రయోగం చేపడుతుందని ప్రకటించారు. ఇందులో ముగ్గురు శాస్త్రవేత్తలు జలాంతర్గామి ద్వారా ఆరువేల కిలోమీటర్ల లోతుకు వెళ్లి సముద్రగర్భంలో అన్వేషణ సాగిస్తారని జితేంద్రసింగ్ పేర్కొన్నారు. గగన్యాన్ మిషన్తో సహా భారత్ పలు చారిత్రాత్మక మిషన్లకు రూపకల్పన చేస్తుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సముద్రయాన్ అంశంపై ప్రసంగించిన విషయం తెలిసిందే. జితేంద్ర సింగ్ మాట్లాడుతూ సముద్రయాన్ ద్వారా కీలకమైన ఖనిజాలు, అరుదైన లోహాలు, తెలియని సముద్రజీవ వైవిధ్యం గురించి సమాచారాన్ని సేకరిస్తామన్నారు. గగన్యాన్ ప్రాజెక్టు మానవరహిత మిషన్ను సైతం అదే ఏడాది నిర్వహిస్తామన్నారు. ఇందులో రోబోట్ వ్యోమ్ మిత్రను సైతం పంపనున్నట్లు పేర్కొన్నారు.
ఇంకా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఇస్రోని 1969 స్థాపించినట్లు తెలిపారు. కానీ, 1993 వరకు తొలి లాంచ్ ప్యాడ్ను స్థాపించేందుకు రెండు దశాబ్దాలకుపైగా సమయం పట్టిందన్నారు. రెండో లాంచ్ ప్యాడ్ను 2004లో నిర్మించారని, అందుకు మరో దశాబ్దం పట్టిందన్నారు. గత పదేళ్లకాలంలో భారత అంతరిక్ష రంగం మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు విస్తరించినట్లు పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం భారీ రాకెట్లను నింగిలోకి పంపేందుకు వీలుగా మూడో లాంచ్ పాడ్ను శ్రీహరికోటలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. చిన్న ఉపగ్రమాల కోసం తమిళనాడులోని టుటికోరిన్ జిల్లాలో కొత్త ప్రయోగ వేదిక కేంద్రాన్ని ఏర్పాటు చేసి.. శ్రీహరికోట స్పేస్ సెంటర్ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. భారతదేశ స్పేస్ ఎకానమీ ప్రస్తుతం 8 బిలియన్ డాలర్ల విలువ ఉందని.. వచ్చే దశాబ్దం నాటికి 44 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని తెలిపారు. ఇది ప్రపంచంలో భారత్ అంతరిక్ష రంగంలో ఓ సూపర్ పవర్గా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు.