న్యూఢిల్లీ : తక్కువ ధరలకు చమురును సరఫరా చేసేందుకు ముందుకొచ్చిన వారందరి నుంచీ భారత్ చమురు కొనుగోలు చేస్తుందని పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Singh Puri) పేర్కొన్నారు. గత ఏడాది ఉక్రెయిన్పై దండెత్తిన అనంతరం రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన క్రమంలో రష్యా నుంచి భారత్ తక్కువ ధరకు ముడిచమురును కొనుగోలు చేస్తోంది.
ప్రస్తుతం రష్యా భారత్కు అతిపెద్ద చమురు సరఫరాదారుగా మారిన సంగతి తెలిసిందే. వీలైనంత తక్కువ ధరలకు మన పోర్టులకు దిగుమతి చేయగలిగిన అన్ని వనరుల నుంచి ఇంధన కొనుగోళ్లు జరిపేందుకు భారత్ సిద్ధంగా ఉందని మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతిదారుగా భారత్ 80 శాతం ఇంధన అవసరాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.
ఇక దుబాయ్తో రూపాయల్లో వర్తకం గురించి మీడియా అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ చమురు రంగంలో రూపాయిలో లావాదేవీలు ప్రస్తుతం తక్కువగా ఉన్నాయని చెప్పారు. డాలర్లకు బదులు ఇరు దేశాలు రూపాయిలో వర్తకం జరిపేందుకు ఈ ఏడాది జులైలో అంగీకరించాయి.యూఏఈతో తాము రూపాయి-దీర్హం ఒప్పందం చేసుకున్నా ఆయిల్ రంగంలో లావాదేవీలు చాలా పరిమితంగా సాగుతున్నాయని మంత్రి వివరించారు.
Read More :
Road Accident | రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం..!