Road Accident | బిహార్ రోహతాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాతపడ్డారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, పరిస్థితి విషమంగా ఉన్నది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శివసాగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పఖ్నారి సమీపంలో బుధవారం ఉదయం రెండో నంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న కంటైనర్ను స్కార్పియో ఢీకొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను వాహనంలో నుంచి వెలికి పోస్టుమార్టానికి తరలించారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. హైవేపై ఆగి ఉన్న కంటైనర్ను స్కార్పియో వేగంగా వచ్చి ఢీకొట్టింది.
సంఘటనా స్థలంలోనే ఏడుగురు మృతి చెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాహనంలో మృతులు, క్షతగాత్రులు బోధ్ గయా నుంచి కైమూర్ జిల్లా కుడారి గ్రామానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం అనంతరం బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రక్కుల డ్రైవర్లు వాహనాలనే హైవే పక్కనే పార్క్ చేసి వదిలిస్తున్నారని, చీకట్లో వేగంగా వస్తున్న వాహనాలకు సరిగా కనిపించక ప్రమాదానికి గురవుతున్నాయని, దీనిపై ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.