పాట్నా: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించి నిరసన వ్యక్తం చేశారు. (Giriraj Singh Shown Black Flags) బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. తన సొంత పార్లమెంటరీ నియోజకవర్గమైన బెగుసరాయ్పై గిరిరాజ్ సింగ్ దృష్టిసారించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
కాగా, ఆదివారం బరౌనిలో డెయిరీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, ఆ తర్వాత బచ్వాడలో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు కాన్వాయ్లో బయలుదేరారు. అయితే జాతీయ రహదారి 28లోని రాణి గ్రామ సమీపంలో బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. నల్లజెండాలు చూపించి గిరిరాజ్ కాన్వాయ్ను చుట్టుముట్టారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. దీంతో కేంద్ర మంత్రి కాన్వాయ్ కొంతసేపు జాతీయ రహదారిపై నిలిచిపోయింది. స్పందించిన పోలీసులు నిరసనకు దిగిన బీజేపీ కార్యకర్తలను పక్కకు లాక్కెళ్లారు.
మరోవైపు జిల్లాలో ఏర్పాటు చేసిన పెప్సీ ప్లాంట్లో బెగుసరాయ్ నుంచి ఎవరికీ ఉపాధి కల్పించలేదని నల్ల జెండాలతో నిరసన తెలిపిన బీజేపీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. గిరిరాజ్ సింగ్కు ఐదు నుంచి పది లక్షలు ఇచ్చిన వారికి మాత్రమే ఆ ప్లాంట్లో ఉపాధి కల్పించారని వారు ఆరోపించారు. కాగా, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు బీజేపీ కార్యకర్తలు నల్లజెండాలు చూపించి నిరసన వ్యక్తం చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बीजेपी सांसद गिरिराज सिंह को उनके संसदीय क्षेत्र में बीजेपी कार्यकर्ताओं ने काले झंडे दिखाए। pic.twitter.com/j7OmTGtg9U
— Lutyens Media (@LutyensMediaIN) March 10, 2024