న్యూఢిల్లీ : వాహనాల్లో ఎయిర్ బ్యాగులకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటి వరకు వాహనాలకు రెండు బ్యాగులు తప్పనిసరి అని కేంద్రమంత్రి లోక్సభలో తెలిపారు. కారులో వెనుక సీట్లో ఉండే ప్రయాణికులకు ఎయిర్ బ్యాగులు లేవని, వారికి కూడా ఎయిర్ బ్యాగులు ఉండేలా రవాణాశాఖ ప్రయత్నిస్తోందన్నారు. దీంతో ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో వారి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. ఈ విషయంలో ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని, త్వరలోనే నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
2024 నాటికి భారత్లో రహదారి మౌలిక సదుపాయాలు అమెరికా తరహాలో ఉంటాయని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 2024కి ముందు 26 గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేలను నిర్మిస్తామని, దీంతో ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని తెలిపారు. ఒకసారి ఈ హైవే నిర్మాణం జరిగితే ఢిల్లీ నుంచి డెహ్రాడూన్, ఢిల్లీ నుంచి హరిద్వార్, ఢిల్లీ జైపూర్కు రెండుగంటల్లో చేరుకోవచ్చన్నారు. ఎన్హెచ్ఏఐ నిధుల లభ్యతపై ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా అడిగిన ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. నిధులకు కొరత లేదని, దేశంలో రహదారుల మౌలిక సదుపాయాల ముఖ చిత్రాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామంటూ సమాధానం ఇచ్చారు.