న్యూఢిల్లీ: దేశంలో ఉన్న చారిత్రక స్థలాలు, స్మారక కట్టడాల పరిరక్షణ, నిర్వహణపై కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు కేంద్రాన్ని ప్రశ్నించారు. సాంస్కృతిక శాఖ, ఏఎస్ఐ, ఇతర విభాగాల్లో పెద్దఎత్తున ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని, దీంతో ఈ శాఖల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతున్నదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు.
దీనిపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి సోమవారం లోక్సభలో మాట్లాడుతూ, సాంస్కృతిక శాఖకు 13,865 పోస్టులు కేటాయించగా, అందులో 4919 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ప్రకటించారు. వివిధ రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 3696 స్మారక కేంద్రాల నిర్వహణ, పరిరక్షణ ఏఎస్ఐ నేతృత్వంలో సాగుతున్నదని తెలిపారు. సాంస్కృతిక శాఖ ఆధీనంలోని వివిధ విభాగాల్లో 3646 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు.