న్యూఢిల్లీ : మహారాష్ట్ర రాజకీయాలు (Maharashtra Politics) రసవత్తరంగా సాగుతున్నాయి. 8 మంది ఎమ్మెల్యేలతో పార్టీ ఫిరాయించిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులుగా షిండే సర్కార్లో కొలువుతీరడం కలకలం రేపింది. ఇక అజిత్ పవార్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ముగ్గురు నేతలను ఎన్సీపీ పార్టీ నుంచి బహిష్కరించింది. మహారాష్ట్ర రాజకీయాలు కాక రేపుతుండగా బిహార్, యూపీలోనూ ఈ పరిస్ధితి తలెత్తే అవకాశం ఉందని కేంద్ర మంత్రి రాందాస్ అథవలే వ్యాఖ్యానించారు.
బిహార్ సీఎం నితీష్ కుమార్ ఆర్జేడీతో చేతులు కలపడం పట్ల పలువురు ఎమ్మెల్యేల్లో అసమ్మతి రాజుకుందని అన్నారు. యూపీ విషయానికి వస్తే పట్నా విపక్ష భేటీకి జయంత్ చౌదరి గైర్హాజరుతో ఆయన ఎన్డీఏలో చేరవచ్చని పేర్కొన్నారు. మహారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణల నేపధ్యంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవలే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం మలుపు తిరుగుతున్నాయి. పార్టీ ఫిరాయించిన తొమ్మిది మందిపై అనర్హత వేటు వేసేందుకు ఎన్సీపీ సన్నద్ధమైంది.
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్కు ఇప్పటికే శరద్ పవార్ శిబిరం తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. రెబెల్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఎన్నికల కమిషన్ను కూడా ఆ పార్టీ ఆశ్రయించింది. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పార్టీ అధినేత శరద్ పవార్ వెన్నంటి ఉన్నారని ఎన్సీపీ పేర్కొంది. రెబెల్ ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టాలని కోరుతూ శరద్ పవార్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ను పరిశీలిస్తున్నామని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నర్వెకర్ తెలిపారు.
Read More :