లక్నో : ఆగ్రాలో అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్కు శుక్రవారం రాత్రి పెను ప్రమాదం తప్పింది. జయంతి వేడుకలకు ఏర్పాటు చేసిన వేదిక కూలిపోవడంతో పలువురు గాయపడ్డారు. వేదిక కూలిన సమయంలో అక్కడే ఉన్న కేంద్రమంత్రిపై వేదికపై ఏర్పాటు చేసిన లైట్లతో పాటు పలువురు వ్యక్తులు మీదపడ్డారు.
స్ధానిక పోలీసులు, భద్రతా సిబ్బంది కిందపడిన ఆయనను పైకిలేపారు. ఈ ఘటనలో నలుగురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్ధితి విషమంగా ఉందని సమాచారం. సన్మాన కార్యక్రమాలు, వేడుకల్లో వేదికలు కూలుతున్న ఘటనలు సాధారణమయ్యాయని హిందుస్ధానీ బిరదారి వైస్ చైర్మన్ విశాల్ శర్మ పేర్కొన్నారు.
వీవీఐపీల పర్యటన సందర్భంగా వేదికలపై ఎక్కువ మందిని అనుమతించకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. బీఆర్ అంబేద్కర్ 131వ జయంతోత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి ఆగ్రాకు చేరుకున్నారు. దళితుల ప్రాబల్యం అధికంగా ఉండే ఆగ్రాలో పలు పార్టీల సీనియర్ నేతలు అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు.