న్యూఢిల్లీ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాకు ఢిల్లీ నుంచి పిలుపువచ్చింది. లఖిపూర్ ఖేరీ హింసాకాండలో కీలక నిందితుల్లో కేంద్రమంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కూడా ఉన్నాడు. ఈ క్రమంలో లక్నో నుంచి దేశ రాజధాని బయలుదేరారు. ఇదిలా ఉండగా.. లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనపై చర్చకు పట్టుపట్టడంతో లోక్సభలో గందరగోళం నెలకొంది. దీంతో బుధవారానికి సభ వాయిదా పడింది. ప్రతిపక్షాలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
మరో వైపు ఘటనపై విచారణ జరుపుతున్న యూపీ ప్రభుత్వ సిట్ మంగళవారం కోర్టుకు సమర్పించిన నివేదికలో ఘటన ‘ప్రణాళికాబద్ధమైన కుట్ర’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి వర్గం నుంచి మిశ్రాను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఇందులో మంత్రి పాత్రపై విచారణ జరుపాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సైతం డిమాండ్ చేశారు. ఈ క్రమంలో కేంద్రమంత్రికి ఢిల్లీ నుంచి పిలుపురావడంతో సర్వత్రా చర్చనీయాంశంమైంది. ఆయనతో రాజీనామా చేయిస్తారనే ఊహాగాలున్నాయి.