అమరావతి : డ్రగ్స్ కట్టడికి ముఖ్యమంత్రులు ప్రాధాన్యం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. ఆదివారం తిరుపతిలో అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ భేటీ జరిగింది. మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరగ్గా.. దక్షిణ భారతదేశానికి చెందిన పలువురు సీఎంలు, మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా 51 పెండింగ్ సమస్యలకు 40 పరిష్కారమైనట్లు కేంద్ర మంత్రి ట్వీట్ చేశారు. కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం జగన్ ప్రారంభోపన్యాసం చేయగా.. చివరగా అమిత్ షా ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలు కొవిడ్ టీకా రెండో డోసు పంపిణీని వేగవంతం చేయాలని, ముఖ్యమంత్రులు, అధికారులు పురోగతిని సమీక్షించాలని కోరారు. భారత ప్రభుత్వం ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ల సవరణ ప్రక్రియను ప్రారంభించిందని చెప్పారు. అధికారులు, నిపుణులతో సవరణల కోసం రాష్ట్రాలు తమ ఇన్పుట్స్ను సమర్పించాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తుందన్న కేంద్రమంత్రి వాటికి కట్టడికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ కేసులను విచారణను వేగవంతం చేయాలని, ఇందుకు స్వతంత్ర విచారణ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు.
ప్రధాని చొరవతో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్, విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయాలు స్థాపించామని, అన్ని రాష్ట్రాలు కనీసం ఒక ఫోరెన్సిక్ సైన్స్ కళాశాలను స్థానిక భాషలో సిలబస్తో ఏర్పాటు చేయాలని, తద్వారా వారు ఫోరెన్సిక్ పరిశోధన అవసరాలను తీర్చేందుకు శిక్షణ పొందిన మానవ వనరులు అందుబాటులో ఉంటాయన్నారు. పోక్సో నేరాలు జీరో శాతం ఉండాలన్నారు. పిల్లలపై నేరాలు ఆమోదయోగ్యం కాదన్న ఆయన.. కేసులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నవంబర్15ని జన్జాతి గౌరవ్ దివస్గా పాటించాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భారత స్వాతంత్య్ర పోరాటం, రాష్ట్రాల అభివృద్ధిలో గిరిజనుల సహకారాన్ని హైలెట్ చేసేందుకు రాష్ట్రాల్లో కార్యచరణ ప్రణాళికను అభివృద్ధి చేయాలని కేంద్రమంత్రి సమావేశంలో సీఎంలు, మంత్రులను కోరారు.