(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పొత్తులపై త్వరలోనే నిర్ణయాలు వెలువడుతాయన్నారు. త్వరలో జరుగనున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పొత్తులకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబపరంగానే బాగుంటుందని, రాజకీయపరంగా కాదని షా పేర్కొన్నారు. రాజకీయ కూటమి ఎంత పెద్దగా ఉంటే అంత మంచిదన్న షా.. రాష్ర్టాలలోని పరిస్థితులను బట్టి ఎన్డీయే కూటమి నుంచి కొందరు బయటకు వెళ్లి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు శనివారం ఢిల్లీలో నిర్వహించిన టైమ్స్గ్రూప్ ఈటీ నౌ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2024లో ఆయన మాట్లాడారు.
నమ్మి వచ్చిన పార్టీలతో జట్టు కడతాం
రాష్ట్రీయ లోక్దళ్ (ఆర్ఎల్డీ), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) వంటి ప్రాంతీయ పార్టీలు ఎన్డీయేలో చేరతాయా? అని పొత్తుల గురించి అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిస్తూ.. త్వరలో ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తారన్నారు. ‘కుటుంబాలకే ఫ్యామిలీ ప్లానింగ్. దాన్నే మేం నమ్ముతాం. కానీ రాజకీయ కూటమిలో ఫ్యామిలీ ప్లానింగ్ కుదరదు. కూటమిలో ఎంతమంది సభ్యులుంటే అంత మంచిది.
దాన్ని మేం స్వాగతిస్తాం. మా విధానాలు, సిద్ధాంతాలను నమ్మి వచ్చిన పార్టీలతో జట్టు కట్టడానికి మేమెప్పుడూ సిద్ధమే. ఎన్డీయే కూటమిలోని మిత్రులను మేమెప్పుడూ బయటకు పంపించలేదు. ఆయా రాష్ర్టాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని వాళ్లే బయటకు వెళ్లి ఉండొచ్చు. రాజకీయ పొత్తులు కొన్నిసార్లు స్థానిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు బట్టి ఉంటాయి. మా సిద్ధాంతాలను సమర్థించే వారితో జట్టు కడతాం’ అన్నారు.
అకాలీదళ్తో చర్చలు జరుగుతున్నాయి
‘రాజకీయ పార్టీలు కూటమిలోకి వస్తాయి. పోతాయి. ఘట్బంధన్లో భాగంగా మేం వేరే పార్టీలతో పొత్తు పెట్టుకొన్నప్పుడు.. బీజేపీకి కొన్ని చోట్ల పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, పొత్తు ధర్మం ప్రకారం.. చిన్న పార్టీలకు ముఖ్యమంత్రి పదవిని కూడా కట్టబెట్టాం’ అని అమిత్ షా చెప్పారు. పంజాబ్లో కాంగ్రెస్, ఆప్ను ఎదుర్కోవడానికి పాత మిత్రులు అకాలీదళ్ నేతలతో చర్చలు జరుపుతున్నారు కదా! అన్న ప్రశ్నకు అమిత్ షా స్పందిస్తూ.. ఇంకా చర్చలు జరుగుతున్నాయని, తుది దశకు చేరుకోలేదని బదులిచ్చారు. ఇక, ఆంధ్రప్రదేశ్లోని పొత్తులపై అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. ఈ విషయంపై సభావేదిక మీద ఇప్పుడే తానేమీ చెప్పలేనని ఆ అంశాన్ని దాటవేశారు.
మూడోసారి బీజేపీదే అధికారం
ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని, మొత్తంగా ఎన్డీయే కూటమి 400కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదన్నారు. ప్రతిపక్షంలోనే మళ్లీ కూర్చోబోతున్నామని విపక్ష పార్టీలకు ఇప్పటికే అర్థమయినట్టు ఎద్దేవా చేశారు.
‘కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే ఆర్టికల్ 370ని మేము రద్దు చేశాం. రానున్న ఎన్నికల్లో దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు, మొత్తంగా ఎన్డీయేకు 400కి పైగా సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్సభ ఎన్నికలకు ముందే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని కూడా తెలిపారు. సీఏఏపై ముస్లిం సోదరులను ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించి ఎగదోస్తున్నారని షా మండిపడ్డారు. పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో హింసను భరించలేక వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికే సీఏఏ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఎవరి పౌరసత్వాన్ని కూడా తొలగించబోమన్నారు.
రాహుల్కు ఆ అర్హత లేదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర గురించి అడిగిన ప్రశ్నలపై కూడా ఈ సందర్భంగా అమిత్ షా స్పందించారు. 1947లో దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన రాహుల్కు ఈ తరహా యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ.. ‘2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకుల్లో ఉన్నది. ఎక్కడచూసినా కుంభకోణాలే. విదేశీ పెట్టుబడులు కరువయ్యాయి.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అప్పుడు శ్వేతపత్రం తెచ్చి ఉంటే.. ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేది. ఈ పదేండ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. అవినీతి లేదు. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయి. అందుకే శ్వేత పత్రాన్ని తీసుకురావడానికి ఇదే సరైన తరుణం అని నమ్మాం. తీసుకొచ్చాం’ అని తెలిపారు. రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500-550 ఏండ్లపాటు నమ్మారని, బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ కల ఆలస్యమైనప్పటికీ, ఎట్టకేలకు సాకారం అయిందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ఓబీసీ వివాదంపై స్పందించిన షా.. 1994లో గుజరాత్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోదీ కులం ఓబీసీగా రిజిస్టరైనట్టు పేర్కొన్నారు. అప్పటికి మోదీ ఏ ఒక్క ఎన్నికల్లో పోటీ పడలేదని గుర్తుచేశారు. ప్రధాని కులంపై చర్చ దురదృష్టకరమన్న షా.. రాహుల్ గాంధీకి బహిరంగంగా అబద్ధాలు చెప్పడం అలవాటుగా మారిందని మండిపడ్డారు.