న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కేంద్రంలోని వివిధ పోస్టుల్లో నియమించేందుకు ఐపీఎస్ అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ రాష్ర్టాలకు లేఖ రాసింది. తాము ఎంపిక చేసిన ఐపీఎస్ అధికారుల పేర్లను రాష్ర్టాలు తొలగిస్తున్నాయని లేదా వారిని కేంద్రంలో అధికారాలు చేపట్టేందుకు పంపడం లేదని హోం శాఖ ఆవేదన వ్యక్తంచేసింది. దీంతో ‘సెలక్షన్, డిప్యూటేషన్, క్యాడర్ మేనేజ్మెంట్’ ప్రక్రియ తీవ్రంగా ప్రభావితమవుతున్నదని పేర్కొంది. కేంద్రం పరిధిలో పనిచేయడానికి ఎంపికైన అధికారులు నెల రోజుల్లోగా వచ్చి చేరకపోతే వారిని ఐదేండ్ల పాటు డిబార్ చేస్తామని హెచ్చరించింది.
నియామక ఉత్తర్వులు వెలువడిన నెల రోజుల్లో వారు వ్యక్తిగత కారణాలతో చేరకపోయినా లేక సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వారిని రిలీవ్ చేయకపోయినా ఐదేండ్ల పాటు వారిని డిబార్ చేస్తామని స్పష్టంచేసింది. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ర్యాంక్ వరకు కేంద్రంలోని 17 సంస్థల్లో 220 ఐపీఎస్ అధికారుల పోస్ట్లు ఖాళీగా ఉన్నాయి. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో సహా వివిధ కేంద్ర సాయుధ బలగాలలో ఈ ఖాళీలు ఉన్నట్టు హోంశాఖ వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ద్వారా ఐపీఎస్ అధికారులను నియమిస్తుంది. వీరి సర్వీసులను వివిధ రాష్ర్టాల క్యాడర్లుగా నియమిస్తారు. నిబంధనల ప్రకారం ప్రతి రాష్ట్ర క్యాడర్లో 40 శాతం మంది సీనియర్లను సెంట్రల్ డిప్యూటేషన్ రిజర్వు (సీడీఆర్) పోస్టుల్లో నియమించాలి. కొంతమంది ఐపీఎస్ అధికారులు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కేంద్ర సర్వీసుల్లో చేరేందుకు తమ సమ్మతిని తెలియజేసినప్పటికీ సంబంధిత అధికారులు లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వారిని రిలీవ్ చేయడం లేదని హోం శాఖ తెలిపింది. అర్హుడైన ప్రతి అధికారి కనీసం రెండుసార్లు కేంద్రం స్థాయిలో పనిచేసేందుకు రాష్ర్టాలు అవకాశం కల్పించాలని సూచించింది. కనీసం 14 ఏండ్ల అనుభవం ఉన్న అధికారులు కేంద్రంలో డీఐజీ స్థాయిలో నియమితులయ్యేందుకు అర్హులని తెలిపింది.