న్యూఢిల్లీ: ఏడాది పాటు జరిగిన ఆందోళనల్లో పోలీసుల వల్ల ఒక్క రైతు కూడా చనిపోలేదని ఇవాళ కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది నుంచి ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ సాగు చట్టాలను తాజాగా రద్దు చేశారు. ఇవాళ రాజ్యసభలో రైతు ఆందోళనలపై వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధానం ఇచ్చారు. ఆందోళనల్లో మృతిచెందిన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చే అంశం ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆందోళనల సమయంలో పోలీసుల వల్ల ఒక్క రైతు కూడా మరణించలేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత ధిరాజ్ ప్రసాద్ సాహూ, ఆప్ నేత సంజయ్ సింగ్ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.