కోల్కతా : జీఎస్టీ కాలపరిమితి మరో ఐదేళ్లపాటు పొడగించి.. రాష్ట్రాలకు పెండింగ్లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇంధన ధరలను నియంత్రించాలని, టోల్ టాక్స్ వసూలును తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. ఇంధన ధలర పెరుగుదల ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. ‘దేశ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, రాబోయే రోజుల్లో రాష్ట్రాలు జీతాలు చెల్లించగలవో? లేదో ? నాకు అనుమానం’గా ఉందని అన్నారు. ఇంధనం, ఇతర నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నియంత్రించడానికి కేంద్రం ఏమీ చేయడం లేదని ఆరోపించిన మమత, పెంపును నిరోధించే విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజకీయ నాయకులను వేధించడానికి సీబీఐ, ఈడీని ఉపయోగించకుండా ధరలను నియంత్రించేందుకు మార్గాలను కనుగొనాలని హితవు పలికారు.