హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం చేతులెత్తేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బియ్యం కొనలేమని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా బియ్యం, గోధుమ నిలువలు ఉన్నాయని, ఇకపై బాయిల్డ్ రైస్ తీసుకోమని.. వాటిని నిలువ చేసే పరిస్థితి లేదని చెప్పింది. రైతులు వరి, గోధుమకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది. రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలని.. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగు చేయాలని సూచించింది. అన్ని రాష్ట్రాలకు ఇదే సూచనలు చేస్తున్నామన్నది.
ప్రస్తుతం రబీ పంట సీజన్ ఇంకా ప్రారంభం కాలేదని, రబీ ధాన్యం సేకరణపై రాష్ట్రాలతో చర్చించాల్సి ఉందని కేంద్రం పేర్కొంది. వచ్చే ఏడాది ఎంత బియ్యం సేకరించాలో నిర్ణయిస్తామని చెప్పింది. ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో విధంగా డిమాండ్ ఉంటుందని, గత నిర్ణయాల మేరకు ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ సేకరించామని, ఇకపై కొనమని చెప్పింది. దేశీయ అవసరాలు, ఎగుమతుల మేరకు నిర్ణయం ఉంటుందని తెలిపింది. ఎగుమతి అవకాశాలను పరిగణలోకి తీసుకుంటున్నామన్న కేంద్రం.. ఎగుమతులకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయని పేర్కొంది.
ఈ సందర్భంగా రైతులు ప్రత్నామ్నాయ పంటలు వేయాలని.. నూనె, పప్పు ధాన్యాల పంటలు ఎక్కువగా సాగు చేయాలని, అన్ని రాష్ట్రాలకు ఇదే సూచనలు చేస్తున్నామన్నది. రాష్ట్రాలు సేకరించేంత వరకే పరిమితం కావాలని చెప్పింది. గతంలో తెలంగాణ నుంచి 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు, 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది. రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ధాన్యం, బియ్యం సేకరణ జరుగుతున్నట్లు ఆహార, వినియోగదారుల మంత్రిత్వ శాఖ వివరించింది. ప్రస్తుతం దిగుమతి చేసుకునే ఆయిల్, పప్పు ధాన్యాలు, ఇతర విషయాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నట్లు స్పష్టం చేసింది.