న్యూఢిల్లీ: ఇప్పటికే వ్యవసాయానికి వినియోగించే పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని నానా విధాలుగా రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్న నరేంద్రమోదీ సర్కారు ఇప్పుడు సాగునీటిపైన పన్ను విధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. త్వరలోనే సాగునీటిపై పన్నులు విధించేందుకు సమాయత్తం అవుతున్నది. సాగునీటి విధానం, పంట రకాలను బట్టి పన్నులు వసూలు చేయాలని కేంద్రం కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా అన్ని రాష్ర్టాలతో ఇటీవల ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించింది.
‘భారతదేశంలోని ప్రధాన, మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టుల నీటి చార్జీలు, భౌతిక, ఆర్థిక అంశాల స్థిరీకరణకు అనుసరించాల్సిన పద్ధతులు’ పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వర్క్షాప్ను నిర్వహించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కర్ణాటక తదితర రాష్ర్టాలు సాగునీటికి విధిస్తున్న పన్నులపై ఈ వర్క్షాప్లో చర్చించింది. త్వరలోనే అన్ని రాష్ర్టాలకు కలిపి ఏకరీతిలో పన్నులు విధించే విధానాన్ని తీసుకురావాలని కుట్రలకు తెరలేపింది. అయితే సమావేశానికి హాజరైన తెలంగాణ సాగునీటి పారుదలశాఖ అధికారులు మాత్రం సాగునీటిపై పన్నులను విధించడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.