న్యూఢిల్లీ: కనీస వేతనాలు, జాతీయ ప్రామాణిక వేతనాలను నిర్ణయించే విషయంలో జాప్యం చేయాలనే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని కేంద్రం స్పష్టంచేసింది. ఆలస్యం చేసే ఉద్దేశంతోనే కనీస వేతనాలపై నిర్ణయం కోసం కేంద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ శనివారం స్పష్టతనిచ్చింది.
కనీస వేతన అంశంపై ఇటీవల ప్రముఖ ఆర్థికవేత్త అజిత్ మిశ్రా నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఆ కమిటీ పదవీ కాలం మూడేళ్లుగా నిర్దేశించింది. దాంతో వేతన నిర్ణయాన్ని మరింత జాప్యం చేసేందుకే మూడేళ్ల కాలానికి నిపుణుల కమిటీని కేంద్రం నియమించిందంటూ వార్తలు వచ్చాయి. అయితే, ఓ వర్గం చేస్తున్న మీడియా ప్రచారంగా కేంద్రం దీన్ని కొట్టిపారేసింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, నిపుణుల కమిటీ వీలైనంత తొందరగా తన నివేదికను సమర్పిస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొన్నది.
ఈ కమిటీ తొలి సమావేశం జూన్ 14న జరుగగా రెండో సమావేశం జూన్ 29న జరగనున్నట్లు కేంద్రం తెలిపింది. వివిధ వృత్తులను బట్టి కనీస వేతనం అనేది ఉంటుంది. కానీ అన్ని వృత్తుల వారికి కనీస వేతనం ఉండటాన్ని జాతీయ ప్రామాణిక వేతనంగా పేర్కొంటారు.