న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విస్తరణ కారణంగా విద్యావ్యవస్థ స్తంభించిపోయింది. పాఠశాలల నుంచి ఉన్నత విద్యాసంస్థల వరకు అన్నీ మూతపడ్డాయి. కానీ, అరకొరగా ఆన్లైన్ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిషాంక్ వివిధ జాతీయ విద్యాసంస్థల డైరెక్టర్లతో సమావేశం కానున్నారు. దేశంలోని ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఎస్ఈఆర్లు, ఐఐఎస్సీల డైరెక్టర్లు విద్యాశాఖ మంత్రితో సమావేశంలో పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో ఆయా విద్యాసంస్థల్లో కరోనా మహమ్మారి కట్టడి కోసం అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యల గురించి విద్యామంత్రి అడిగి తెలుసుకోనున్నారు. అదేవిధంగా ఆన్లైన్ క్లాసుల గురించి, జాతీయ నూతన విద్యావిధానం-2020 అమలు తీరు గురించి కూడా విద్యామంత్రి ఈ సమావేశంలో చర్చించనున్నారు.