BSNL | నష్టాల ఊబిలో కూరుకుపోయిన బీఎస్ఎన్ఎల్ కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ప్రభుత్వ యాజమాన్యంలోని భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL)కు రూ.1.64లక్షల కోట్లతో పునరుద్ధరణ ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాంశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ బుధవారం ప్రకటించారు. ప్యాకేజీలో రూ.43,964కోట్ల నగదు మద్దతు, రూ.1.20లక్షల కోట్ల నగదు రహిత మద్దతు ఉంటుందని తెలిపారు.
అలాగే బీఎస్ఎన్ఎల్, బీబీఎన్ఎల్ విలీనానికి సైతం కేంద్రం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు. దేశంలోని ప్రతి మూలకు బ్రాడ్బ్యాండ్ సేవలను తీసుకెళ్లేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దోహదపడుతుందన్న నమ్మకం ఉందని అశ్విని వైష్ణవ్ అన్నారు. దీంతో పాటు యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ద్వారా రూ. 26,316 కోట్ల అంచనా వ్యయంతో దేశంలోని అన్ని మారుమూల గ్రామాలకు 4జీ సేవల విస్తరణకు సైతం కేంద్రం కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పటి వరకు కొన్ని పట్టణాలకే పరిమితమైన 4జీ సేవలు గ్రామాలకు అందనున్నాయి.