హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఏండ్లకేండ్లు ఖాళీగా ఉన్న ప్ర భుత్వ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం, ప్రైవేటు ఉద్యోగాల కల్పన లేకపోవడంతో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరుగుతున్నదని సెంటర్ ఫర్ మా నిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) సర్వే పేర్కొన్నది. గ్రామీణ భారతం లో నిరుద్యోగిత రేటు సగటున 7 శాతం కంటే ఎక్కువగా ఉండగా, పట్టణాల్లో 8 నుంచి 10 శాతం ఉన్నట్టు వెల్లడించింది. కార్మిక భాగస్వామ్యం కూడా 42.9 నుంచి 39.8 శాతానికి పడిపోవడంతో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఉపాధి పొందుతున్న వారి సంఖ్య పెరగటం లేదని ఆందోళన వ్యక్తం చేసింది.
దేశంలో నిరుద్యోగం ఏటికేటికి పెరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులను తగ్గించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2023-24 బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి కేంద్రం 33 శాతం నిధులు కోత పెట్టింది. అదేవిధంగా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను బలోపేతం చేయడంపై శ్రద్ధ చూపకపోవడం, జాతీయ జీవనోపాధి మిషన్, గ్రామీణ గహ నిర్మాణ పథకం, తదితర సంక్షేమ రంగాలకు కూడా కేంద్రం బడ్జెట్ కేటాయింపులు తగ్గించడంతో ఆ ప్రభావం ఉపాధి కల్పనపై తీవ్రంగా పడింది. దీనికి తోడు జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ సంక్షోభం తదితర కారణాలతో ఆర్థిక కార్యకలాపాల వేగం మందగించింది. స్టార్టప్ ఇండియా, మేకిన్ ఇండియా పథకాలు అటకెక్కడంతో నిరుద్యోగిత రేటు అమాంతం పెరిగిపోయింది.
కేంద్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు సృష్టించకపోగా ఉన్న ఉద్యోగాల్లో కూడా కోత పెడుతుండటంతో నిరుద్యోగుల సంఖ్య నానాటికి పెరుగుతున్నది. దేశంలోని మొత్తం 389 ప్రభుత్వ రంగ సంస్థల్లో 2014లో 16.9 లక్షల ఉద్యోగులు ఉండగా, 2022లో ఈ సంఖ్య 14.6 లక్షలకు తగ్గింది. ఒక్క బీఎస్ఎన్ఎల్లోనే గత తొమ్మిదేండ్లలో లక్షా 81వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామంటూ ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ప్రకారం లెక్కేసుకున్నా.. గడిచిన పదేండ్లలో కొత్తగా 20 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగాలి. అయితే, ప్రభుత్వరంగంలో కేంద్రం కేవలం 7 లక్షల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసింది. అంటే ఏడాదికి సగటున 70 వేల పోస్టులను మాత్రమే నింపింది. ఇచ్చిన హామీలో ఇది 0.35 శాతం కూడా కాదు.