న్యూఢిల్లీ : కరోనాతో అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ చనిపోయాడని పలు మీడియా సంస్థల్లో, సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం మధ్యాహ్నం ప్రసారమైన వార్తలను ఢిల్లీ పోలీసులు, ఎయిమ్స్ వైద్యులు ఖండించారు. చోటా రాజన్ బతికే ఉన్నాడని, చనిపోలేదని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఎయిమ్స్లో ఆయనకు చికిత్స కొనసాగుతుందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్కు ఏప్రిల్ 26వ తేదీన వైరస్ సోకిన విషయం విదితమే. అయితే రాజన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో.. ఆయనను జైలు నుంచి ఢిల్లీ ఎయిమ్స్కు ఏప్రిల్ 27న తరలించారు. కొవిడ్ సోకడంతో ప్రత్యేక వార్డులో సాయుధ పోలీసుల పర్యవేక్షణలో అతనికి చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఢిల్లీ ఎయిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ముంబైలో దోపిడీ, హత్యలకు సంబంధించి 70 క్రిమినల్ కేసులను రాజన్ ఎదుర్కొంటున్నాడు. మోస్ట్ వాంటెడ్ క్రిమిన్ల్గా ఉన్న రాజన్ను 2015లో ఇండోనేషియాలో అరెస్టు చేసి భారత్కు తీసుకొచ్చి తీహార్ జైల్లో ఉంచారు. 2018లో జర్నలిస్ట్ జ్యోతిర్మయ్ డే హత్య కేసులో రాజన్ దోషిగా తేలాడు. దీంతో అతనికి జీవిత ఖైదు విధించారు. రాజన్ పై ఉన్న కేసులన్నింటినీ సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు.