న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో కొత్త ఉద్యోగాల సృష్టి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలే భర్తీకి నోచుకోవడం లేదు. ఖాళీల భర్తీపై ప్రభుత్వ పెద్దల బూటకపు మాటలు తప్ప ఆచరణలో ఏ కోశానా కనిపించడం లేదు. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు పేరుకుపోతున్నాయి. తాజాగా ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ సాక్షిగా అంగీకరించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో చేపట్టే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచి 2021కి సగానికిపైగా పడిపోయాయి.
కాగా, ఇదే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీల అభ్యర్థుల ప్రాతినిధ్యం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ అంబుమణి రామదాస్ అడిగిన ఓ ప్రశ్నకు సామాజిక న్యాయ, సాధికారత శాఖ సహాయ మంత్రి ఏ నారాయణస్వామి సమాధానం ఇచ్చారు.
తగ్గిన ప్రాతినిధ్యం
ప్రమోషన్ల ద్వారా చేపట్టే నియామకాలు కూడా ఈ ఏడేండ్ల వ్యవధిలో గణనీయంగా తగ్గాయి. ఈ క్యాటగిరీలో ఎస్సీల ప్రమోషన్లు దాదాపు 8 వేలు తగ్గగా, దాదాపు 2 వేల మందికి పైగా ఎస్టీ ఉద్యోగులు పదోన్నతికి నోచుకోలేదు. మొత్తంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదా పదోన్నతుల ద్వారా చేపట్టే నియామకాల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం 2014తో పోలిస్తే 2021లో తగ్గింది.
డైరెక్ట్ రిక్రూట్మెంట్ నియామకాలు
2014 : 1,28,629
2021 : 64,073
ప్రమోషన్ల ద్వారా నియామకాలు
2014 : 1,73,363
2021 : 1,40,908